Friday, December 18, 2015

మహామనిషి తుర్లపాటి మల్లేశం

 (15వ వర్థంతి సందర్భంగా నివాళి)

ఈరోజు మా నాన్నగారు తుర్లపాటి వెంకటమల్లికార్జున వరప్రసాదరావు - (టీవీఎంవీ ప్రసాదరావు - మల్లేశం)గారి ఆబ్దికం. విక్రమనామ సంవత్సరం మార్గశిరమాసం శుక్లపక్షం నవమిరోజున వారు లింగైక్యం చెందారు. అంటే ఆంగ్లసంవత్సరాల ప్రకారం  లింగైక్యమైన రోజు  డిసెంబర్ 5 2000 సంవత్సరం. 15వ వర్థంతి సందర్బంగా మా కుటుంబసభ్యులమందరం  శ్రద్ధాంజలి ఘటించాము.

 ఆజానుబాహులు, స్ఫురధ్రూపి, అచంచల ఆత్మవిశ్వాసంతో ఎలాంటి సమస్యలనైనా ఎదురొడ్డి పోరాడగలిగిన ధీశాలి అయిన మా పిత్రుదేవులకు ప్రణమిల్లుతున్నాము.  మా అమ్మగారు  స్వరాజ్యలక్ష్మి (ఫిబ్రవరి 28, 1986లో లింగైక్యం చెందారు) తో వారు దిగిన ఫోటోను కూడా ఇక్కడ ఉంచుతున్నాము. మా నాన్నగారు శివైక్యం చెందిన తర్వాత (నందిగామలో) పార్థివ శరీరాన్ని స్వస్థలమైన అడవిరావులపాడుకు తీసుకువెళ్ళాము. అక్కడే అంత్యక్రియలు పూర్తిచేశాము.

సేవాతత్పరులు

  కృష్ణాజిల్లా నందిగామ మండలంలోని  అడవిరావులపాడు గ్రామాభివృద్ధికి మల్లేశం గారు ఇతోధికంగా సేవలందించారు. ఆయన దేవాదాయధర్మాదాయ శాఖలో నాలుగు దశాబ్దాలపాటు ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ గా పనిచేసినప్పటికీ, నిత్యం శివపూజలు చేస్తున్నప్పటికీ వారి మనసులో అన్యమతాల పట్ల ద్వేషభావం ఉండేది కాదు. అందుకే గ్రామంలో చర్చ్  నిర్మాణం సమయంలో  విరాళం అందజేశారు. ఆయన లింగైక్యం చెంది 15ఏళ్లు అవుతున్నా అనేక మంది గుండెల్లో ఆయన  నిలిచే ఉన్నారు.

నిరుద్యోగలపాలిట `దేవుడు'

  దేవాలయాల్లో కానుకలను హుండీలోనే వేయాలనీ, అప్పుడే అవి దేవాలయ అభివృద్ధికి దోహదకారి అవుతాయని అంటుండేవారు. హారతి పళ్లెంలో వేస్తే అవి కేవలం ఒక వ్యక్తికి (పూజారికి) మాత్రమే చెందుతాయనీ   చెప్పేవారు.  అనేక దేవాలయాల్లో పేదరికంతో బాధపడుతున్న అర్చక కుటుంబాలవారికి ఉద్యోగాలు ఇప్పించారు. అలాగే ఇతర కులాలవారికి కూడా తనకు చేతనైన పరిథిలో ఉద్యోగాలు ఇప్పించేవారు. మా నాన్నగారు నాకు తెలిసినంతవరకు బెజవాడ కనకదుర్గమ్మ, గుంటూరు వెంకటేశ్వరస్వామి వారి ఆలయం, మంగళగిరి పానకాలస్వామివారి ఆలయం, వేదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం వంటి చోట్ల ఈఓగా పనిచేశారు. రిటైర్ అయిన తర్వాత ముక్త్యాల  సంస్థానంలో మేనేజర్ గా కొన్నాళ్లు పనిచేశారు.

మాట కటువు, మనసు వెన్న

  ఎవరైనా వచ్చి, `నా పరిస్థితి బాగోలేదు, సాయం చేయండయ్యా' అని అడిగితే చాలు, తన జేబులో ఎంత ఉంటే అంత ఇవ్వడం నేను కళ్లారా చూశాను. వ్యక్తి స్వార్థం, కుటుంబ స్వార్థం కంటే, సమాజహితమే గొప్పదని చెబుతుండేవారు. మాట కటువుగా ఉన్నా, మనసు వెన్నపూస. కొంతమంది ఆయన మాటతీరుతో ఆయనది పాషాణ హృదయమనీ, ఆయనలో ప్రేమానురాగాలు లేవని అనుకునేవారు. కానీ అది నిజం కాదు. ప్రేమను వ్యక్తీకరించినమాత్రానే వారిలో ప్రేమ పొంగుతుందని అనుకోవడం భ్రమ. ఆ భ్రమ ముసుగులు తొలిగించి చూస్తే, హృదయంలోపల నిండుగా ఉన్న ప్రేమ సాక్షాత్కరిస్తుంది. అలాంటి ప్రేమను వారి నుండి నేను ఆస్వాదించగలిగాను. అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. కుటుంబంలో ఎన్ని ఒడుదుడుకులు తలెత్తినా, మంచినీళ్ల ప్రాయంలా డబ్బులు ఖర్చవుతున్నా, అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా మనోధైర్యాన్ని మాత్రం ఏనాడు విడువలేదు.

ధర్మమూర్తి 

  న్యాయం, ధర్మం ఆయనకు ఆరో ప్రాణం. అధర్మంగా ఎవరు మాట్లాడినా వారికి కోపం చిర్రెత్తుకొచ్చేది. అసలే ముక్కుసూటి మనిషి, ఆపైన నిజాయితీపరులు...అందుకే ఆయనవద్దకు వచ్చి అక్రమాల గురించి మాట్లాడటానికి ఎవ్వరూ సాహసించేవారు కారు. ఓసారి ఫోటో చూడండి. ఆ ముక్కుసూటి తనం మీకే తెలుస్తుంది. మా ఇంట్లో అన్నయ్య, అక్కయ్య, నేను మా నాన్నగారి దగ్గర ఎక్కువగా మాట్లాడేవారామేకాదు. పెద్దయ్యాక కూడా ఏదైనా విషయం వారి చెవిన వెయ్యాలంటే ఒకటికి నాలుగుసార్లు రిహార్సల్స్ వేసుకునేవారం. మా అమ్మగారే చాలా సందర్భాల్లో వారధిగా నిలిచేవారు.
 
                                                                     - తుర్లపాటి నాగభూషణరావు
                                                                        9885292208

No comments:

Post a Comment